- 2019 ఎన్నికల దృష్ట్యా ముందు జాగ్రత్త
- వెంటాడుతున్న అవినీతి, ప్రజా వ్యతిరేకత, జగన్ పాదయాత్ర భయాలు
- రెండు రాష్ట్రాల ఫలితంతో బీజేపీతో చంద్రబాబు కొనసాగింపు
రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలసొచ్చే వ్యవహారం. ఇక బీజేపీతో దోస్తీ 2019 సాధారణ ఎన్నికల వరకు ఇష్టం లేకున్నా కలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా ఇంకా తగ్గలేదని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయి. మోదీ చరిష్మానే చంద్రబాబుకు కావాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి టీడీపీ చాలా మేలు ఉంటుంది. 2014 ఎన్నికల్లో అదే నిరూపితమైంది. టీడీపీ వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేకున్నా మిత్రపక్షం అని మిన్నకుండిపోయింది. కానీ ఎప్పుడో టీడీపీని వదిలేసుకునేది.
బాబును వెంటాడుతున్న భయాలు
ప్రస్తుతం వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో రోజురోజుకు బలోపేతమవుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ ప్రజల్లో ఉంటున్నాడు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడకు వాలిపోతున్నాడు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలుకోవడం లేదు. ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆరు నెలల పాటు పాదయాత్ర చేస్తున్నాడు. అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాడు. ఇక జగన్ పత్రిక సాక్షి పత్రికలో ప్రతి రోజు ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానంగా ప్రచురిస్తోంది. సాక్షి బాబుకు కొరకరాని కొయ్యగా మారింది.
ప్రజా వ్యతిరేకత
ఇప్పటికే అమలు కానీ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని ఏనాడో విస్మరించాడు. నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా, రుణమాఫీ ఇంకా ఇలాంటివెన్నో ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి. వాటిని అమలు చేయకపోవడంతో ప్రతిచోట చంద్రబాబుకు అవమానం ఎదురవుతోంది. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతి, దోపిడీలు, దాడులు, అరాచకత్వం పెరిగిపోవడంతో చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. వీటన్నిటి నేపథ్యంలో బాబు పాలనపై ప్రజలకు విసుగొచ్చింది.
రాజధాని నిర్మాణం
ఇక రాజధాని నిర్మాణం ఒక్క అడుగు ముందుకు పడలేదు. శంకుస్థాపన ఆర్భాటంగా చేసినా ఇంతవరకు ఒక్క నిర్మాణం జరగలేదు. తాత్కాలిక భవనాలు నిర్మించినా అవి అవినీతికి నిలయాలుగా మారాయి. రాజధాని ఆకృతి, భవనాల ఏర్పాటు తదితర ముందుకు కదలేదు. రోజుకో దేశం పోతాడు.. ఈ దేశంలాగా.. ఆ దేశంలాగా.. ఆ సిటీలాగా చేస్తానంటాడు. ఏమీ చేయకుండా మూడున్నరేళ్లు పూర్తి చేశాడు. ఇది చంద్రబాబుకు ప్రధాన శత్రువుగా మారింది.
షాకిచ్చిన సొంత సర్వే
ఇటీవల చంద్రబాబు నాయుడు తన పరిపాలన తీరు, ఎమ్మెల్యేల పరిస్థితిపై సొంత సర్వే చేయించాడు. ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు తెలిశాయి. దీంతో ఆ సర్వే నివేదికను బహిర్గత పర్చలేదు. అయినా మీడియాకు చిక్కకుండా ఉంటుందా? ఆ నివేదిక బయటకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు సగానికి పైగా ఓడిపోతారంట. మంత్రుల్లో 10నుంచి15 మంది దాక పరాజయం పొందుతారని సర్వేలో వెల్లడైంది. ఫలితం ఈవిధంగా ఉండడంతో ఏపీ సీఎం పునరాలోచనలో పడ్డాడు.
ఈ విధంగా వీటితో సతమతమవుతున్న సమయంలో బీజేపీ గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈ విజయం చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశం. బీజేపీతో దోస్తీ కొనసాగించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న చంద్రబాబుకు ఒక క్లారిటీ వచ్చింది. దేశంలో మోదీ హవా తగ్గిందని, బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే వార్తలతో డైలామాలో ఉన్న చంద్రబాబుకు బీజేపీ విజయంతో ఇక కాషాయం పార్టీతో సంబంధాలు కొనసాగించవచ్చని ఫిక్సయ్యాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ సహాయంతో ఎన్నికల్లో విజయం సాధించడం సులువేనని ఓ అంచనాకు వచ్చేశారు. ఈ విధంగా చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమైపోయాడు.