ఏడు సంవల్సరాల తర్వాత హైకోర్టు నిర్ణయంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ గెలుపు కోసం ప్రధాన పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికలు ట్రైల్ వర్షన్ కాబోతున్నాయి. ఇక్కడ కాపులు ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీకి ముచ్చెమటులు పడుతున్నాయి. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడంతోపాటు, కార్పొరేషన్ ఎన్నికల్లో కాపులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారందురు వ్యతిరేకంగా ఓట్లు వేసె అవకాశం ఉండటంతో బాబులో అసహనం కనిపిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మళ్లీ బ్లాక్మెయిల్ ధోరణిలోనే మాట్లాడారు. టీడీపీ గెలుపు తమకంటే ఇక్కడి ప్రజలకే అవసరమని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. కానీ కాకినాడ అభివృద్ది జరగాలంటే టీడీపీనే గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్కు ముందె బాబు చేతులెత్తేశారనె వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాకినాడలో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే కాకినాడలో డ్రైనేజీ సమస్య అన్నది లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తాను హామీ ఇవ్వడం లేదు కానీ టీడీపీని గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ కాకినాడలో ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాపుల రిజర్వేషన్లకు సంబంధించి మంజునాథ్ కమిటీ రిపోర్ట్ త్వరలోనే వస్తుందని దాన్ని కేంద్రానికి పంపించి ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. మొత్తంమీద కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని చంద్రబాబు చెప్పడం ఆసక్తికరంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.