ప్రధానిమోదీ, తెలంగాణా సీఎం కేసీఆర్లై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాతోపాటు విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించారు.కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ అబద్దపు హామీలిచ్చి పబ్బంగడుపుకుంటున్నారని విమర్శించారు.
శేరలింగంపల్లి బహిరంగ సభలో రాహుల్ ఇద్దరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ఒక్కో అకౌంట్లో రూ.15లక్షలు వేస్తానని చెబితే.. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో అబద్దపు హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు.
రాఫెల్ కుంభకోణం, అవినీతి, ఆయన స్నేహితుల గురించి పార్లమెంటులో తాను ప్రశ్నించిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. వీటి గురించి మోదీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని, పార్లమెంటులో మోదీ ఎక్కడెక్కడో చూస్తూ మాట్లాడారని, తన కళ్లలోకి మాట్లాడే ధైర్యం ఆయనకు లేకపోయిందని విమర్శించారు. అవినీతిపరులే ఎదుటి వ్యక్తి కళ్లలోకి నేరుగా చూడలేరని, మోదీ కాపలాదారు కాదని, అవినీతిలో భాగస్వామి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దళితులకు మూడుఎకరాల ఇళ్లను నిర్మించనున్నట్టు కేసీఆర్ హమీ ఇచ్చారని చెప్పారు. మరో వైపు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మోడీ కూడ ఇదే తరహాలో నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలను ఇస్తామని ఇచ్చిన హమీని ప్రస్తావిస్తూ ఇద్దరూ కూడ అబద్దపు హమీలు ఇస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంభించిన విధానాల కారణంగా 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని ఆయన చెప్పారు. దళిత, ఆదివాసీలను కేసీఆర్ మోసం చేశారని రాహుల్ చెప్పారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందన్నారు. తెలంగాణలో ఒకే కుటుంబం లబ్దిపొందుతోందన్నారు. ఒక్క శాతం భూమి కూడ దళితులకు ఇవ్వలేదన్నారు. ఒక్క హమీని కూడ కేసీఆర్ నిలుపుకోలేదన్నారు
అవినీతికి తెలంగాణ రాజధానిగా మారిందని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. నోట్లరద్దు, జీఎస్టీ విషయంలో కేంద్రానికి మద్దతు తెలిపిన కేసీఆర్.. తెలంగాణకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చమని కేంద్రాన్ని ఎందుకు అడగడటం లేదో చెప్పాలన్నారు. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి.. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు పెద్ద వ్యత్యాసమేమీ లేదని విమర్శించారు.