కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మరో సారి బాబును టార్గెట్ చేశారు. నాకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని బాబు చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నదే 25 ఎంపీ సీట్లు ఈ మాత్రం ఎంపీలతో బాబు, జగన్లు ఢిల్లీలో ఎలా చక్రం తిప్పుతారో చెప్పాలని ఉండవల్లి ప్రశ్నించారు.
పార్లమెంటులో పూర్తి స్థాయిలో చర్చ జరిగితేనే విభజన నేరం ఎవరిదనే విషయం తేలుతుందని చెప్పారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు సీట్లను గెలుచుకోవడంపై దృష్టిని సారించాయని, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఏకాకిని చేయవద్దని కోరారు. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా లైవ్ టెలికాస్ట్ ను అందుబాటులో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని… ఒక వేళ లైవ్ టెలికాస్ట్ లేకపోతే బీజేపీ అధికారంలో ఉండేదని చెప్పారు.
ఓటింగ్ సరిగా నిర్వహించలేదని, పార్లమెంట్ తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారు. లైవ్ ప్రసారాలు ఉండి ఉంటే ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలిసేవి. కేంద్రం ఇచ్చిన నిధులపై అడిగే హక్కు ఎవరికి ఉందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపితే తప్పేంటని సీఎం చంద్రబాబును ఉండవల్లి ప్రశ్నించారు. 2008 అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీ నిర్వహణపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గుర్తుచేశారు. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.