మోడీ ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చంద్రబాబు శక్తులను కూడగట్టే పనిలో ఉన్నారు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని బాబు బావిస్తున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబుతో పోటీపడి అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్ ఈసారి ఆ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. ఇంక పార్లమెంట్ హౌస్లోనికి అడుగుపెట్టే అవకాశం కూడా జగన్ పార్టీకి లేకుండాపోయింది. జగన్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు గత పార్లమెంట్ సమావేశాల అనంతరం రాజీనామాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. వీటిని చాలాకాలం తర్వాత స్పీకర్ సుమిత్ర మహాజన్ కూడా ఆమోదించడం జరిగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం కాకుండా బీజేపీకి రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలున్నారు. జగన్ పార్టీతో పాటూ మిగతా ఎవరికీ ఒక్క ఎంపీ కూడా లేరు. దీంతో రాష్ట్రం కోసం పార్లమెంట్లో గళం వినిపించాలన్నా, పోరాటం చేయాలన్నా.. అవిశ్వాసం పెట్టాలన్నా.. ఒక్క తెలుగుదేశం పార్టీకే అవకాశం ఉంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగిస్తున్నారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 10 వరకూ 24 రోజులు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల ప్రారంభంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని బాబు సిద్ధమవుతున్నారు. దీనికోసం దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతూ కూడగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వద్దన్నా.. ఎలాగూ మద్దతు ఇస్తుంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్కు ఎలాగూ అవకాశం లేదు. దీంతో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబుకు పోటీ లేకుండా పోయింది. రాష్ట్రం నుంచి ఒక్క తెలుగుదేశం తప్ప మరే పార్టీకి అవిశ్వాసం పెట్టే అర్హత లేకుండాపోవడంతో.. చంద్రబాబు సైతం మంచి ఖుషీగా ఉన్నాడు.
ఈసారి చంద్రబాబు తన తంత్రాలన్నీ వాడి అవిశ్వాసంపై చర్చ జరిగేలా చేయగలిగితే చాలు. దేశంలోనే హీరోగా మారిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగా దీనిపై అందరిలోనూ ఆలోచన రేకెత్తుతుంది. ఇప్పటికే మోడీని ఎదిరించిన వ్యక్తిగా చంద్రబాబుకు ఒక్క ఏపీలోనే కాదు.. అనేక రాష్ట్రాల్లో నీరాజనాలు పలుకుతున్నారు. కమల్హాసన్, రజనీకాంత్, స్టాలిన్ లాంటి నాయకులు బహిరంగంగానే చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అవిశ్వాసం దెబ్బకు బాబు పాపులారిటీ అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఈ విషయాలన్నింటినీ ముందుగా ఆలోచించి అడుగేయలేకపోయినందుకు.. జగన్ పార్టీ నాయకులు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. కనీసం ఢిల్లీకి వెళ్లి.. పార్లమెంట్ ఎదుటో, జంతర్మంతర్ వద్దో.. ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసైనా.. అవిశ్వాసం క్రెడిట్ తమకూ కొంత వచ్చేలా చేసుకోవాలనే ప్రయత్నాల్లో జగన్ పార్టీ తలమునకలై ఉందిప్పుడు.