గత కొద్దిరోజులుగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఎంపీ జేసీ దివాకర్రెడ్డి రెండు రోజుల క్రితం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆఘ మేఘాలమీద ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేయడంతో పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. తాజాగా అమరావతిలో బాబుతో 20 నిమిషాల పాటు సమావేశ మవడం ప్రాధాన్యతను సంతిరించుకుంది.
సీఎంతో చాలా విషయాలు మాట్లాడానని, ఏం మాట్లాడానో మాత్రం చెప్పనని అన్నారు. దేశంలో రాజకీయ వాతావరణం బాగోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాటం చేయాల్సిందేనన్నారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టి మాటేనని జేసీ చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కాంగ్రెస్… ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు. మరోవైపు, రాజీనామా వంటి ప్రకటనలపై జేసీకి చంద్రబాబు గట్టిగానే హితబోధ చేసినట్టు సమాచారం.
చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయానికి వచ్చిన జేసీ… పెండింగ్ ఫైల్స్ కు సంబంధించి ఉన్నతాధికారులను కలిశారు. ప్రస్తుతం అంతా బాగుందని తన రాజీనామాపై సమయం వచ్చినప్పుడు చెబుతానని సస్పెన్సన్లో పెట్టారు జేసీ దివాకర్రెడ్డి.