దటీజ్ చంద్రబాబు…….బాబు రాజకీయ వ్యూహాలను 4 దశాబ్ధాలుగా పరిశీలిస్తున్న రాజకీయ మేధావులు వ్యంగ్యంగా చంద్రబాబు విషయంలో చేసే కామెంట్ ఇదే. ఈ జనరేషన్ ఓటర్లకు కూడా తెలిసిన ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ప్రజల్లో ఏ స్థాయి పేరు ప్రఖ్యాతులు, ప్రజాదరణ ఉన్నాయో చెప్పనవసరం లేదు. ఇక కెసీఆర్, జగన్లకు కూడా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ చంద్రబాబుకు మాత్రం అలాంటిదేమీ ఉండదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచే వ్యూహాలు, రాజకీయ ప్రత్యర్థులను అణచే కుట్రల విషయంలో చంద్రబాబు అనితర సాధ్యుడు. ఇక న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలనూ మేనేజే చేయడంలో కూడా చంద్రబాబు సిద్ధహస్తుడు. మొత్తానికి ప్రజలను మోసం చేయడంలో మాత్రం చంద్రబాబును మించిన నాయకుడు లేడని చెప్పొచ్చు.
2019 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు మరోసారి అలాంటి మోసపు వ్యూహానికి తెరలేపాడు చంద్రబాబు. 2014ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన పాపంలో బిజెపి పాత్ర గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు చంద్రబాబు. పైగా విభజన చట్టంలో హోదాతో సహా ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన ప్రయోజనాలన్నీ వెంకయ్యనాయుడులాంటి బిజెపి నేతల చలవే అని ప్రచారం చేశాడు. కాంగ్రెస్ని మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. అంతకుముందు వరకూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతునిచ్చిన చంద్రబాబు సోనియాను పల్లెత్తు మాట అనలేదు. ఒకసారి మోడీతో పొత్తు కుదరగానే అదే సోనియాను తీవ్రస్థాయిలో విమర్శించాడు. ఇప్పుడు మోడీతో పొత్తు తెగిపోయిన నేపథ్యంలో మరోసారి సోనియా భజన చేయడానికి రెడీ అవుతున్నాడు చంద్రబాబు. బిజెపితో పొత్తు కొనసాగుతుండగానే సోనియా కార్యదర్శి అహ్మద్ పటేల్తో సుజనా చౌదరి చర్చలు జరిపిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడిక టిడిపి ఎంపిలు డైరెక్ట్గా సోనియాను కలిశారు. ఆల్రెడీ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు ఖారరైంది. తాజా పరిణామాలు గమనిస్తే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్తో కలిసి టిడిపి ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకసారి పొత్తు కుదరగానే ఇక ఆ తర్వాత నుంచీ విభజన పాపం మొత్తం బిజెపిదే……కాంగ్రెస్ తప్పేమీ లేదు అని చంద్రబాబు సోనియా భజన మొదలెడతాడనడంలో సందేహం లేదు. కాకపోతే 2014లో చంద్రబాబు, ఆయన భజన మీడియాలో నమో భజనను నమ్మి ఓట్లేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనూ, కేంద్ర ప్రభుత్వం చేతిలోనూ దారుణంగా మోసపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికల్లో అదే చంద్రబాబు, ఆయన భజన మీడియా చేయబోయే సోనియా, రాహుల్ల భజనను నమ్ముతారా? ఓట్లేస్తారా? అదే జరిగితే మాత్రం ఇక ఆ తర్వాత నుంచీ ప్రజలను టిడిపి నాయకులు ఏ స్థాయిలో మోసం చేయడానికి కూడా వెనుకాడరేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.