ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమతి 2014లో తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి దిగ్విజయంగా టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తోంది. కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉంటూ టీఆర్ఎస్ను ముందుండి నడిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్లోని జలదృశ్యంలో ఆవిర్భవించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో దివంగత ప్రొఫెసర్ జయశంకర్ తదితరుల సమక్షంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు.
ఇప్పుడు ఆ పార్టీ ఈ నెల 27వ తేదీతో 17 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడులకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 27వ తేదీన ప్లీనరీ, భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికలకు వ్యూహాన్ని ప్లీనరీలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒక కొత్త పథకం కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే ప్లీనరీ, బహిరంగ సభ ఇబ్రహీంపట్నం లేదంటే మేడ్చల్ ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ప్లీనరీ, బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 24వ తేదీన పార్టీ ప్రజా ప్రతినిధులతో ప్లీనరీ, 27న బహిరంగ సభ జరగనుంది. ఈ ప్లీనరీ కోసం 29వ తేదీన 5 లక్షల మంది యాదవులతో నిర్వహించాలనే భారీ బహిరంగసభను వాయిదా వేసే అవకాశం ఉంది.
బహిరంగ సభకు 25 లక్షల మందిని తరలించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు, థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లలో నిమగ్నమైన కేసీఆర్ ఈ బహిరంగ సభకు జాతీయ నాయకులను, ఇతర రాష్ట్రాల నాయకులను ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో థర్డ్ ఫ్రంట్పై చర్చ లేవనెత్తాలనే ప్లాన్ ఉంది.