కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజలను మోసం చేయడంలో అటు ప్రధాని నరేంద్రమోదీ, ఇటు చంద్రబాబు నాయుడు పీహెచ్డీ తీసుకున్నారంటూ ఫైర్ అయ్యారు. నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ లో వరాలు.. పథకాల్ని ప్రకటించటాన్ని ప్రలోభంపెట్టడం కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ లోనూ ఏపీకి ఏమీ ప్రకటించలేదని.. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, నిధుల గురించి ఊసేలేదన్నారు. ముఖ్యమంత్రి చేతకానివాడైతే.. రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బ తింటాయో చెప్పటానికి చంద్రబాబు పెద్ద ఉదాహరణ అన్నారు జగన్.
ఓటుకు నోటు కేసులో ఏ రోజైతే ఇరుక్కున్నారో ఆ రోజే.. ఏపీ భవిష్యత్తు అంధకారమైపోయిందన్నారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదాను వదిలేసి ప్యాకేజీకి ఓకే చెప్పారని.. కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో నాలుగుసార్లు తీర్మానాలు చేయటాన్ని గుర్తు చేశారు.
ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకిస్తూ తాను నల్ల చొక్కాలు వేసుకొని వస్తే.. తమను నానా మాటలు అన్న చంద్రబాబు.. అక్కడితో ఆగకుండా తమ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ నోటీసులు ఇప్పించారని గుర్తుచేశారు. మరీ ఏ మొఖం పెట్టుకొని నల్లచొక్కాలు ధరించారని ఘాటుగా బాబును ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి తనకు 30 సెకన్లు కూడా టైమివ్వలేదని.. చంద్రబాబు వ్యవహారం హత్య చేసినోడు ఆ హత్యకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నారు.
వైఎస్ జగన్ వ్యాఖ్యలను చూస్తే .. జగన్కు ప్రధానికి మధ్య లాలూచీ ఉందని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పినట్టైంది. ఇక కేంద్ర బడ్జెట్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుందంటూ ఓ ఛానల్ చేసిన హాడావుడి మాములుగా లేదు. కానీ సదరు చానల్కు చంద్రబాబు చేసే హామీలు మాత్రం ఆ కోణంలో కనపడటం లేదు సరికదా.. ఆహా, ఓహో అంటూ భజన చేస్తుంది. తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే ఇంకేదో అన్నట్టు ఉంది వారి వ్యవహరం.