ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది.. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు కత్తి దూసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో ఇప్పటికే చెప్పేశారు ఇరు పార్టీల నేతలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో హామీలు ఇస్తూ వచ్చారు. చంద్రబాబు కూడా జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసి.. వాటి లబ్ధి చేకూరాలంటే మళ్లీ నన్ను గెలిపించాలన్నారు.
ఇప్పుడు ఎన్నికల ప్రచారం రెండో దశకు ఎంటరైంది. అంటే ప్రజలు మొదటి దశను మరిచినట్టే. ఈ దశలో నేతల నిబద్ధత, పనితనం, నిజాయితీపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై ఏ పార్టీ ఏం చేసింది. ఎవరేవరు ఎప్పుడు ఏం మాట్లాడారు? అన్న దానిపై మాటల యుద్ధం సాగింది.
ఇక ఇప్పుడు భావోద్వేగ అంశం ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఒక్కసారి తెలంగాణ ఎలక్షన్లను గమనిస్తే ఈ భావోద్వేగం ఎంతగా పనిచేస్తుందో అర్థమవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పాలనపై కొంచెం వ్యతిరేకత ఉండేది. అది అంతో ఇంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కలిసి వచ్చేది. కానీ అనూహ్యంగా చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. చంద్రబాబు స్పీచ్లకు కౌంటర్గా కేసీఆర్ చేసిన ప్రచారం, తెలంగాణ వాసుల్లో రేపిన భావోద్వేగ అంశంతో అప్పటి వరకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ కూడా అనుకూలంగా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణపై చంద్రబాబు పెత్తనం చేస్తారన్న కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజల మనసుల్లో నాటుకుపోయాయి. కేసీఆర్ సంక్షేమ పథకాలకు.. ఈ భావోద్వేగం తోడవటంతో అనూహ్య విజయాన్ని సాధించింది టీఆర్ ఎస్.
ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ కూడా అదే అంశం నడుస్తోంది. డేటా చోరి కేసును రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణగా మార్చి భావోద్వేగ అంశంగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన డేటాను చోరి చేశారంటూ ఓ వర్గం మీడియా తీవ్రంగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ నేతలు మనకు అన్యాయం చేస్తున్నారంటూ ఆనాడు కేసీఆర్ ఎలాగైతే స్పీచ్లు ఇచ్చారో .. చంద్రబాబు అదే తీరుగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ-టీఆర్ ఎస్ ఒకటే అని ప్రచారం మొదలైంది. జగన్ అధికారంలోకి వస్తే హైదరాబాద్లోని ఏపీ ప్రజల ఆస్తులు ఏమౌతాయో అని ఓ టీడీపీనేత ప్రశ్నించారు. అంటే ఇప్పుడు భాగ్యనగరంలో ఏపీ ప్రజల ఆస్తులను చంద్రబాబు కాపాడుతున్నారా? ఏమో ఆ నేతకే తెలియాలి.
ఇటు తెలంగాణ నేతలు కూడా అదే తీరున చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలను ఓ వర్గం మీడియా దాన్ని హైలేట్ చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఏపీ ప్రజల మనసుల్లో భావోద్వేగ అంశాన్ని రెచ్చగొట్టడానికి ఓ రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అసలు కేసీఆర్.. జగన్కు మద్దతు ఇవ్వడం ఎవరికి లాభం? అనే ప్రశ్న ఉదయిస్తోంది. కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం కేసీఆర్కు బాగా కలిసి వచ్చింది. మరి కేసీఆర్, జగన్తో పొత్తు పెట్టుకోవడం ఎవరికి కలిసి వస్తుంది?
ఏపీ ప్రజలు ఈ భావోద్వేగం ట్రాప్లో పడతారా? లేక ఈ డేటా చోరి కేసులో నిజానిజాలేంటని ఆలోచిస్తారా? వేచి చూడాలి మరి.