బ్యాటింగ్,బైలింగ్,ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో ఓ జట్టు విఫలమైతే ఎలాగుంటుందో ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవచ్చు. వన్డే ప్రపంచకప్లో భాగంగా లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో చిత్తైంది ఆస్ట్రేలియా. అన్ని రంగాల్లో విఫలమైన ఆసీస్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 313 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్..సఫారీ బౌలర్ల దెబ్బకు 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్తో జరిగిన మ్యాచ్లోనూ కేవలం 200 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. టాప్ ఆర్డర్తో పాటు కీలక బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేశారు ఓ దశలో 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లబుషేన్, స్టార్క్ జోడీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఏడో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది ఆసీస్. లబుషేన్ ఒక్కడే 46 పరుగులతో రాణించాడు.
ఈ మ్యాచ్లో మొత్తంగా ఆసీస్ నాలుగు క్యాచ్లు జారవిడవటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది.
ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, డెంబా బవుమాలు తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ప్రపంచకప్లో తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన డికాక్.. ఆస్ట్రేలియాపై కూడా సెంచరీ చేసి వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. డికాక్ (109) పరుగులతో రాణించగా మార్క్రమ్ (56), హెన్రిచ్ క్లసెన్ (29) పరుగులు చేశారు.
48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా ఆస్ట్రేలియా ఇంత దారుణంగా ఓటమి పాలవడం ఇదే తొలిసారి. 1983 ప్రపంచకప్లో భారత్ చేతిలో ఆసీస్ 118 పరుగుల తేడాతో చిత్తయ్యింది. తాజాగా 134 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.