భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు తుది ఎలెవన్ (Playing XI) లో ఉంటాడా లేదా అనే విషయంపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించారు.
ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అంతకుముందు ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, ఇంగ్లాండ్పై ఎలాగైనా పుంజుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలగా ఉంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్కు ఐర్లాండ్ సిరీస్లో ఆడే అవకాశం రాలేదు. దీంతో ఇంగ్లాండ్తో సిరీస్లోనైనా అతనికి అవకాశం ఇవ్వాలని అభిమానులు, విశ్లేషకులు కోరుతున్నారు.
మొదటి టీ20 మ్యాచ్కు ముందు ప్రెస్మీట్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ముందు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతానికి జట్టు పరంగా మేం ఏం చేయబోతున్నామనే దానిపై మా చేతులు కూడా కట్టేసి ఉన్నాయి. ఇది చాలా వ్యక్తిగతమైనది. మేము జట్టు మేనేజ్మెంట్తో చర్చించుకునే విషయమిది. మేం ఎలాంటి కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామో ముందే బయటపెట్టి, ప్రత్యర్థి జట్టుకు వ్యూహాలు అందించలేం. వైభవ్ అద్భుతమైన ప్రతిభావంతుడు . అతనికి ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అద్భుతంగా రాణిస్తాడు అని పేర్కొన్నారు.
ఇంగ్లాండ్తో సిరీస్ కోసం భారత జట్టు వ్యూహాల్లో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. ఐర్లాండ్ సిరీస్లో చేసిన తప్పులనే ఇక్కడ కూడా పునరావృతం చేస్తే ఇంగ్లాండ్ చేతిలో కూడా ఓటమి తప్పదు. కాబట్టి భారత్ ఈ సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ, సీనియర్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
