టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్పై ఐర్లాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్తో జరగబోయే కీలక సిరీస్కు ముందు భారత క్రికెటర్లు ఫామ్లోకి రావడానికి ఐర్లాండ్ టూర్ మంచి అవకాశమని అందరూ భావించారు. కానీ బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్కు ఊహించని షాక్ ఇస్తూ ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఐర్లాండ్ జట్టు ఒక దశలో 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు టిమ్ టెక్టర్ 17 పరుగులు, రాస్ అడైర్ 12 పరుగులు చేయగా, స్టార్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఈ తరుణంలో వికెట్ కీపర్-బ్యాటర్ లోర్కాన్ టక్కర్ ఇన్నింగ్స్ను నిలబెట్టి, జట్టుకు ఎంతో అవసరమైన అర్ధ సెంచరీని సాధించాడు. అతనికి గారెత్ డెలానీ నుండి అద్భుతమైన మద్దతు లభించింది దీంతో వీరిద్దరూ కలిసి కీలకమైన 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చివర్లో బెంజమిన్ కాలిట్జ్ మరియు జార్జ్ డోక్రెల్ కొన్ని కీలక పరుగులు జోడించడంతో ఐర్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 182 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా అద్భుతంగా రాణించి తన 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్లు తలో రెండు వికెట్లు తీశారు. అయితే, ప్రసిద్ధ్ కృష్ణకు ఈ మ్యాచ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది, అతను తన 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు.
లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ…. ఐరిష్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ అవతలి ఎండ్ నుండి ఎలాంటి మద్దతు లభించలేదు. అతని ఓపెనింగ్ భాగస్వామి సంజు శాంసన్ 5 పరుగులకే నిష్క్రమించగా..ఇషాన్ కిషన్ 1 పరుగు, కొత్తగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ 3 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు.
అభిషేక్ శర్మ 50 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత భారత వికెట్లు పేకమేడలా కూలిపోయాయి. ఐర్లాండ్ బౌలర్లు మ్యాచ్పై పూర్తి పట్టు సాధించారు. మాథ్యూ హంఫ్రీస్, మాథ్యూ హోలార్డ్ చెరో 3 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కోలుకోకుండా చేశారు. భారత బ్యాటర్లను క్రీజులో సెట్ అవ్వనివ్వకుండా చేస్తూ చివరకు ఐర్లాండ్కు సునాయాస విజయాన్ని అందించారు.
భారత జట్టుకు ఈ ఓటమి ఒక రకంగా హెచ్చరిక లాంటిదే. గత కొన్ని నెలలుగా వారి మిడిల్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ కొన్ని మార్పుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరినీ ఫినిషర్లుగా ఉంచడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.
