ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ పోరాడి నిలిచింది. వరుసగా మూడు పరాజయాల అనంతరం విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం ఉంచుకుంది. ముందుగా బట్లర్ బ్యాట్తో మరోసారి మెరిపించగా.. తర్వాత బౌలర్లు గౌతమ్, సోధి బంతితో మాయ చేసి పంజాబ్పై 15 పరుగుల తేడాతో గెలుపొంది ఓటమికి బదులు తీర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్ జోస్ బట్లర్ (82: 58 బంతుల్లో 9×4, 1×6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కేఎల్ రాహుల్ (95 నాటౌట్: 70 బంతుల్లో 11×4, 2×6) ఆఖరి బంతి వరకూ అజేయ పోరాటం చేసినా పంజాబ్ను గెలిపించలేకపోయాడు.
ఆరంభంలోనే క్రిస్గేల్ (1), అశ్విన్ (0) కరుణ్ నాయర్ (3) వికెట్లను చేజార్చుకోవడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. ఒక ఎండ్లో కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకారం అందించేవారు కరవయ్యారు. అక్షదీప్ (9), మనోజ్ తివారి (7), అక్షర్ పటేల్ (9) కీలక సమయంలో ఔటవడంతో చివరికి పంజాబ్ 143/7కే పరిమితమైంది. టోర్నీలో వరుసగా మూడు ఓటముల తర్వాత మళ్లీ రాజస్థాన్ జట్టు గెలుపొందగా.. పంజాబ్కు ఇది మొత్తంగా నాలుగో ఓటమి.