2018 హజ్ యాత్ర కోసం ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇప్పటివరకూ పది వేల మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది మక్కాకు వెళుతుంటారు. అయితే.. ఈ ఏడాది సౌదీ ప్రభుత్వ సూచన మేరకు కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం హజ్ యాత్రికులకు oral polio vaccination, Meningitis Vaccination, Influenza Vaccination ఇస్తోంది. సౌదీలోని మక్కాకు వెళ్లేవాళ్లు ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ వాక్సినేషన్ వేసేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ వాక్సినేషన్ శిబిరాలను స్టేట్ హజ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విజయవాడ, ఒంగోలు, కర్నూల్, ఆత్మకూర్, నంద్యాల, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరులలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి హజ్ యాత్రికులకు వాక్సిన్ వేస్తున్నారు.
విమాన షెడ్యూల్ ప్రకారం..
హజ్ విమాన షెడ్యూల్ వచ్చిన తర్వాత తమకు కేటాయించిన తేదీకి 24 గంటల ముందు హైదరాబాద్ లోని నాంపల్లి హజ్ హౌస్ కు రెండు రాష్ట్రాల్లోని యాత్రికులు చేరుకోవాలి. హైదరాబాద్ హజ్ హౌస్ కు చేరుకున్నతరువాత ప్రతి యాత్రికుడు పేపర్ వీసా మీద ఉన్న వివరాలు, పాస్ పోర్ట్ లో వున్న వివరాలతో సరిపోల్చుకొని చూసుకోవాలి. ప్రతి హజ్ యాత్రికుడు వాక్సిన్ తీసుకోవడం, శిక్షణా తరగతుల్లో సూచించిన సలహాల మేరకు ఆ దేశ విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుంది.
లగేజీ విషయంలో జాగ్రత్త..
మక్కాకు వెళ్లేవారు తమతో పాటూ తీసుకెళ్లే దుస్తులు, ఇతర సామగ్రి విషయంలోనూ అవగాహన లేకపోవడంతో నచ్చినంత తీసుకెళ్తుంటారు. అయితే ఈసారి హజ్ యాత్రికులు తీసుకెళ్లే లగేజీ విషయంలోనూ కొన్ని నిబంధనలున్నాయి. ఒక్కొక్కరికీ 22 కేజీల బరువైన రెండు సూట్కేసులు + హ్యాండ్ లగేజ్ 10 కేజీలకు మాత్రమే అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్లడానికి అనుమతించరు. ఒకవేళ ఇంతకంటే అధికంగా లగేజీ తీసుకెళ్తే విమానాశ్రయాల్లోనే అడ్డుకుంటారు. అందుకే.. ముందుగానే లగేజీని కొలత వేసుకుని తీసుకెళ్లడం మంచిది.
