హాస్యనటుడిగా నటిస్తున్న సమయంలో హీరోగా సునీల్ మారిపోయాడు. హీరోగా మారిన తర్వాత మాత్రం అస్సలు కలసిరాలేదు. ఒక్క మర్యాద రామన్న సినిమా మాత్రం ఆడింది. ఆ తర్వాత ఒక్క విజయం లేకున్నా సునీల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. చివరికి విజయం కోసం సిక్స్ ప్యాక్ చేసి మరీ నటించారు. అయినా కలిసి రాలేదు. ఆ నేపథ్యంలో చివరిసారిగా హీరోగా మరో ప్రయత్నంతో సునీల్ వచ్చాడు. 2 క్రంటీస్ అని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జై బోలో తెలంగాణలాంటి సూపర్ హిట్ సినిమా తరువాత దర్శకుడు ఎన్.శంకర్ మలయాళ సినిమాకు రీమేక్గా 2 కంట్రీస్ సినిమా తీశాడు. ఈ సినిమాతోనైనా సునీల్కు కలిసొచ్చేనా? అని చూడాలి.
కథ : పల్లెటూరులో సులభంగా డబ్బు సంపాదించే వ్యక్తిగా ఉల్లాస్ కుమార్ (సునీల్) ఉంటాడు. డబ్బు కోసం ఏమైనా చేయాలనే మనస్తత్వం ఉన్న పల్లెటూరి కుర్రాడు. డబ్బు కోసం ప్రాణ స్నేహితులు, కుటుంబీకులను ఇరకాటంలో పెడుతుంటాడు. ఈ నేపథ్యంలో రౌడీ పటేల్ వద్ద తీసుకున్న అప్పును తీర్చలేకపోతాడు. అప్పు తీర్చడానికి రెండు కాళ్లు లేని వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఆ సమయంలో విదేశంలో స్థిరపడిన తన చిన్ననాటి స్నేహితురాలు లయతో పరిచయమవుతుంది. ఆమెకు కోట్ల ఆస్తిని ఉందని తెలుసుకొని ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆశతో పటేల్ చెల్లిని కాదంటాడు. వెంటనే లయను పెళ్లి చేసుకుంటాడు. అయితే లయకు చిన్నతనంలో తన అమ్మనాన్నలు విడిపోవడంతో మద్యానికి బానిసగా ఉంటుంది. ఉల్లాస్తో పెళ్లయితే తన అలవాట్లకు అడ్డురాడనే నమ్మకంతో పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత లయ గురించి తెలుసుకున్న ఉల్లాస్ ఆమెతో మందు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. లయ గతం తెలుసుకొని ప్రేమతో ఆమెను మామూలు మనిషిని చేయాలనుకుంటాడు. ఉల్లాస్ ప్రేమను లయ అర్థం చేసుకుందా..? ఈ ప్రయత్నంలో ఉల్లాస్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? రౌడీ పటేల్ ఏం చేశాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: హీరోగా సునీల్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అది సినిమాలో కనిపిస్తుంటుంది. తనకు అలవాటైన కామెడీ టైమింగ్తో అలరించే ప్రయత్నం చేశాడు. భావోద్వేగాలను చక్కగా పలకించాడు. తొలి సినిమాతోనే హీరోయిన్ మనీషా రాజ్ మంచి నటన కనబరిచింది. మద్యానికి బానిసైన పొగరుబోతుగా నటించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్రెడ్డి మరోసారి కామెడీతో ఆకట్టుకున్నాడు. పృథ్వీ, నరేశ్ తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగులో తీయడానికి దర్శకుడు ఎన్.శంకర్ చేసిన ప్రయత్నాలు కొంచెం బెడిసింది. సునీల్ గత చిత్రాల్లో మాదిరి రొటీన్ కామెడీతో సినిమాను నడిపించాడు. సినిమా నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపిస్తుంది. గోపిసుందర్ సంగీతం పరవాలేదు. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. పల్లెటూరి అందాలతో పాటు విదేశీ లొకేషన్స్లో అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉండాలి. నిర్మాణాత్మకంగా సినిమా హైలెట్గా ఉంది. కథాకథనం సోసోగా నడిపించడంతో సినిమా కొంచెం ఇబ్బందిగా థియేటర్ సీట్లో కూర్చొవాల్సి ఉంది.
రొటీన్ సినిమాలతో సునీల్ మరోసారి వచ్చాడు. అయితే ఇది అతడి హీరోగా నిలబెట్టేంత లేదని చెప్పవచ్చు. ఒకే జోనర్ నేపథ్యంలో సినిమాలు చేస్తుండడం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.
నటీనటులు : సునీల్, మనీషా రాజ్, శ్రీనివాస్ రెడ్డి, నరేశ్, పృథ్వీ
సంగీతం : గోపీ సుందర్
నిర్మాత, దర్శకత్వం : ఎన్.శంకర్