అజ్ఙాతవాసి సినిమా రిలీజ్ ముందు వరకూ కేవలం త్రివిక్రమ్ పేరు మీదనే సినిమాలు బిజినెస్ అయిన పరిస్థితి. ఓవర్సీస్తో పాటు ఎ క్లాస్ సెంటర్స్ అన్నింటిలోనూ త్రివిక్రమ్ బ్రాండ్కి సూపర్ క్రేజ్ ఉండేది. అయితే అజ్ఙాతవాసి దెబ్బకు త్రివిక్రమ్పై ఇప్పుడు బిజినెస్ వర్గాలన్నీ కూడా అనుమానంగా చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ కథతో వచ్చిన చల్ మోహన్ రంగా సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు త్రివిక్రమ్ సామర్థ్యంపై డిస్ట్రిబ్యూటర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి.
అందుకు తగ్గట్టుగానే ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపై పడింది. టెంపర్ సినిమా నుంచీ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు ఎన్టీఆర్. సర్దార్ గబ్బర్సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన బాబీతో తీసిన జైలవకుశ కూడా ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ క్రేజ్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా భారీ రేట్లకు అమ్ముడుపోవాలి. అయితే త్రివిక్రమ్పైన ఉన్న డౌట్సే ఎక్కువగా డామినేట్ చేయడంతో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కేవలం 7.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఓ టాప్ రేంజ్ స్టార్ హీరో సినిమాకు ఈ రేటు చాలా తక్కువ. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్ ట్రేడ్ సర్కిల్లో చర్చనీయాంశం అవుతోంది. అ..ఆ..సినిమాతో కూడా ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ రాబట్టిన త్రివిక్రమ్ ఒక్క సినిమా ఫ్లాప్తో ఈ రేంజ్కి పడిపోవడం మాత్రం ఇతర డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక పెద్ద లెస్సన్ అని డైరెక్టర్స్ సర్కిల్స్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఈ పాఠం తర్వాత అయినా సినిమాకు 15 నుంచి 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీస్తారేమో చూడాలి మరి.