ఎన్నో అంచనాలతో సినిమాను నిర్మిస్తాం.. కానీ ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతనే ఆ సినిమా ఆడుతుందా.. లేదా అని తెలిసేది. దాన్ని బట్టి మార్కెట్ ఉంటుంది. అయితే సినిమా విడుదలకు ముందు సినిమాపై అతి నమ్మకంతో రెట్టింపు రేటుకు విక్రయిస్తుంటారు. సినిమా ఆడితే వారికి లాభాలు వస్తాయి. లేదంటే నష్టాలు వచ్చి అప్పులు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఇటీవల వీవీ వినాయక్ సినిమాలకు జరిగాయి. అయితే బయర్లకు నష్టమొస్తే వినాయక్ తన మంచితనంతో వారిని ఆదుకున్నాడు. ఇప్పుడు ‘ఇంటలిజెంట్’ సినిమా విషయంలోనూ అదే చేశారని సమాచారం.
ఫిబ్రవరి 9వ తేదీన సాయిధరమ్తేజ్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఇంటలిజెంట్’ సినిమా విడుదలైంది. అయితే ఆ సినిమా విడుదల రోజే బ్యాడ్ టాక్ వచ్చేసింది. ఇక వారం కూడా ఆడే పరిస్థితి లేదు. అయితే ఈ సినిమాకు సాయిధరమ్ మార్కెట్ కంటే ఎక్కువ రేటులో విక్రయించారు. ఇప్పుడు బయ్యర్స్ అందరూ తీవ్రంగా నష్టపోయారు. దీంతో వినాయక్ స్పందించి వారిని ఆదుకున్నాడట. తన రెమ్యూనరేషన్లో వారికి కొంత ఇచ్చారని తెలుస్తోంది. తన రూ.9 కోట్ల రెమ్యునరేషన్లో రూ.5 కోట్ల వరకు చెక్కును వెనక్కి ఇచ్చాడని టాక్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో వినాయక్ మంచితనం తెలుగు సినీ పరిశ్రమకు మంచి చేసేలా ఉంది. ఇలా అందరూ ఉంటే పరిశ్రమ ప్రశాంతంగా కొనసాగుతుంది.
అయితే ‘అఖిల్’ సినిమా విషయంలోనూ వినాయక్ అలాగే చేశారంట. అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమా ఉహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. రూ.43 కోట్లతో రూపొందించిన ఆ సినిమా కేవలం రూ.17 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్స్ దారుణమైన నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే వినాయక్ వారిని నష్టాల నుంచి తప్పుకునేలా కొంత రెమ్యునరేషన్ని తిరిగి ఇచ్చేశాడు. దాంతో పాటు తాను దర్శకత్వం వహించిన చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా వినాయక్ ‘అఖిల్’ సినిమా బయ్యర్స్కు ఆ సినిమా అందేలా చేశారు. ఈ సినిమా విజయం పొందడంతో వారు లాభాలను అందుకున్నారు. దీంతో అందరూ హ్యాపీగా ఉన్నారు.