సంక్రాంతి తర్వాత తొలి లిస్ట్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి టీడీపీ -జనసేన. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా సీట్ల పంపకంపైనే చర్చ జరిగింది. ఇక తాజాగా మూడున్నర గంటల పాటు బాబుతో సమావేశమైన పవన్ పోటీ చేసే స్థానాలు,సీట్లపై దాదాపు క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో నాదేండ్ల మనోహర్తో పాటు లోకేష్ కూడా పాల్గొనగా ఫస్ట్ లిస్ట్తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 12 ప్రధాన అంశాల ప్రాతిపదికన మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
మొదటి నుండి టీడీపీ – జనసేన మధ్య కొన్ని స్థానాల విషయంలో చిక్కుముడి వీడటం లేదు. రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు తగ్గేదేలే అంటుండటంతో ఇన్ని సార్లు చర్చలు జరిగిన ఈ అంశం మాత్రం కొలిక్కిరాలేదు.
ప్రధానంగా తెనాలిలో టీడీపీ తరపున ఆలపాటి రాజా, జనసేన నుండా నాదెండ్ల మనోహర్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాగే పిఠాపురం-వర్మ( టీడీపీ), తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లేదా ముద్రగడ( జనసేన), రాజానగరం- బొడ్డు వెంకటరమణ(టీడీపీ), బత్తుల బలరామకృష్ణ( జనసేన),అవనిగడ్డ- మండలి బుద్దప్రసాద్(టీడీపీ), రామకృష్ణ( జనసేన జిల్లా అధ్యక్షుడు) మధ్య గట్టిపోటీ నెలకొంది. విజయవాడ వెస్ట్- బుద్దా వెంకన్న(టీడీపీ), పోతిన మహేశ్ ( జనసేన),గుంటూరు వెస్ట్- కోవెలమూడి రవీంద్ర(టీడీపీ), బోనబోయిన శ్రీనివాస యాదవ్( జనసేన),పెందుర్తి- బండారు సత్యనారాయణ(టీడీపీ), పంచకర్ల రమేశ్ ( జనసేన),భీమిలి-గంటా శ్రీనివాసరావు లేదా రాజాబాబు(టీడీపీ), పంచకర్ల సందీప్( జనసేన),నెల్లిమర్ల – బంగార్రాజు(టీడీపీ), లోకం మాధవి( జనసేన),ధర్మవరం- పరిటాల శ్రీరాం లేదా గోనుగుంట్ల సూర్యనారాయణ(టీడీపీ), మధుసూదన్ రెడ్డి( జనసేన),చీరాల- కొండయ్య యాదవ్(టీడీపీ), ఆమంచి స్వాములు( జనసేన) నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.
అలాగే కాకినాడ,అమలాపురం,నర్సాపురం,నర్సారావుపేట,పెడన,రాజమండ్రి రూరల్,తణుకు,ఉంగుటూరు స్థానాలపై ప్రతిష్టంభన నెలకొనగా ఫస్ట్ లిస్ట్లో ఈ స్థానాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఎన్నికల రేసులో వైసీపీ దూసుకుపోతుండగా టీడీపీ మాత్రం ఇంకా చర్చల పేరుతో కాలయాపన చేస్తుండటం విశేషం.