చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనల మీద వాదనలు జరుగగా ఈ నెల 19 వరకు రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఇవాళ్టితో చంద్రబాబు రిమాండ్ ముగియనుండటంతో బెయిల్ వస్తుంది అని ఆశతో ఎదురుచూసిన టీడీపీ శ్రేణులకు నిరాశే మిగిలింది. మూడోసారి చంద్రబాబు రిమాండ్ను పొడగించింది న్యాయస్థానం.
మొదటి రిమాండ్ ముగిసిన తర్వాత చంద్రబాబును రెండ్రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. దీంతో జైలులోనే చంద్రబాబు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. ఆ తర్వాత రెండోసారి అక్టోబరు 5 వరకు రిమాండ్ విధించారు. తాజాగా మూడోసారి 14 రోజుల పాటు రిమాండ్ను పొడగించారు ఏసీబీ కోర్టు జడ్జి. ఏపీ ప్రభుత్వం తరపున పొన్నవొలు సుధాకర్ రెడ్డి బలంగా వాదనలు వినిపించారు. చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఆయన తన రీజన్స్ తెలిపారు. చంద్రబాబు లాయర్లు లేవనెత్తిన ప్రతీ అంశానికి కౌంటర్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించారు జడ్జి. ఇక మరోవైపు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.
స్కిల్డెవలప్మెంట్ కేసులో నారా లోకేశ్ను అరెస్టు చేయొద్దంటూ ఈ నెల 12 వరకూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది ఏపీ హైకోర్టు. దీంతో లోకేష్కు కాస్త రిలీఫ్ దక్కింది.