ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. న్యాయస్ధానం 14 రోజుల రిమాండ్ విధించగా బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం లేకుండా పోతోంది. ఇక బాబు అరెస్ట్ సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తుండగా ఆయన తనయుడు నారా లోకేష్ హస్తిన వేదికగా బాబు అరెస్ట్ ప్రస్తావన ఉండేలా ముందుకెళ్తున్నారు.
ఇక లోకేష్ ప్రధానంగా హస్తినకు వెళ్లింది వివిధ పార్టీల మద్దతు కోరడం, బాబుది అక్రమ అరెస్ట్ అని వాదన వినిపించడం, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడం. అయితే లోకేష్ ఢిల్లీ టూర్ అనగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసేందుకేనని ప్రచారం జరిగింది. షా అపాయింట్మెంట్ కూడా కోరారని ఆయన ఆఫీస్ వర్గాలు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు అవుతోంది. బీజేపీ పెద్దల నుండి ఎలాంటి చలనం లేదు.
దీంతో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు లోకేష్. ఏపీలో జగన్కు వ్యతిరేకంగా ఎవరు కలిసొచ్చినా వారిని కలుపుకుంటు ముందుకుపోతామని చెప్పారు. ఇప్పటివరకు టీడీపీ చేస్తున్న ఆందోళకు మద్దతిచ్చింది జనసేన, లెఫ్ట్ పార్టీలు. ఇప్పటికే జనసేన -టీడీపీతో పొత్తు కన్ఫామ్ కాగా లోకేష్ మాట్లాడింది లెఫ్ట్ పార్టీల గురించేనా అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే బాబు అరెస్ట్ తర్వాత బీజేపీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. హస్తినలో ఆ పార్టీ నేతలను కలిసేందుకు వచ్చిన లోకేష్కు నిరాశే ఎదురైంది. దీంతో ఇక బీజేపీని నమ్ముకుని లాభం లేదనే నిర్ణయానికి వచ్చారట లోకేష్.
ఇక లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే టీడీపీ…ఇండియా కూటమిలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయ్సాయి రెడ్డి వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ ఇండియా కూటమికి చెందిన నేతలు మాత్రమే చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నారని..త్వరలోనే టీడీపీ ..ఇండియా కూటమిలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక బాబు అరెస్ట్ను ఎస్పీ, తృణమూల్ ఖండించగా ఈ రెండు ఇండియా కూటమిలోనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందా అన్న వార్త చర్చనీయాంశంగా మారింది.