మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతల పంతం నెగ్గింది. వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం కాకుండా చివరి వరకు అడ్డుకుని ఈ ప్రక్రియలో విజయం సాధించారు టీ కాంగ్రెస్ నేతలు. కారణాలేవైనా షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనానికి బ్రేక్ పడింది. దీంతో తెలంగాణలో 119 స్ధానాల నుండి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు షర్మిల. ఇక ఇప్పటివరకు పాలేరు నుండి పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె…సీఎం కేసీఆర్ బాటలోనే రెండు స్ధానాల నుండి పోటీకి సై అంటున్నారు. పాలేరుతో పాటు మిర్యాలగూడ రెండు స్ధానాల నుండి షర్మిల పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి.
అయితే షర్మిల కాంగ్రెస్లో చేరకుండా ఉండటానికి ప్రధాన కారణం కోదండరాం అనే తెలుస్తోంది. కోదండరామ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి.. ఆయన పోటీచేసే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కోదండరామ్తో పాటు మరో రెండు లేదా మూడు స్ధానాలు ఆయన అనుచరులకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్.. తెచ్చిన నాయకుడిగా కోదండరామ్ను ప్రమోట్ చేస్తూ లబ్ది పొందాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇక కోదండరామ్ని కాంగ్రెస్ టికెట్పైగాని లేదంటే కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ జనసమితి నుంచి గాని బరిలోకి దించాలని చూస్తున్నారు. ఇక కోదండరామ్ కోసం తనను బలిపశువుని చేయడం జీర్ణించుకోలేక పోతున్నారు షర్మిల. కాంగ్రెస్ హ్యాండిచ్చినా.. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టి తానేంటో నిరూపించుకోవాలని షర్మిల ఆరాట పడుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ చేతిలో భంగపడ్డ షర్మిల ఏ మేరకు సత్తాచాటుతుందో వేచిచూడాలి.