అంతా ఊహించినట్లే జరిగింది. బీఆర్ఎస్కు రాజీనామా చేశారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్కాజ్గిరితో పాటు మెదక్ అసెంబ్లీ స్ధానాన్ని అడిగారు మైనంపల్లి. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరు మైనంపల్లిపై సీరియస్ అయ్యారు. దీంతో మైనంపల్లి పార్టీ మారడం ఖాయమని, కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కొద్దిరోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు మైనంపల్లి. ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు. మల్కాజ్ గిరి ప్రజలు, కార్యకర్తలు, అనుచరుల కోరిక మేరకు రాష్ట్రంలో నలుమూలల ఉన్న నా శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా..ఏ పార్టీలో చేరబోతున్నానో త్వరలోనే తెలియజేస్తాను అని చెప్పారు. దీంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మల్కాజ్గిరితో పాటు మెదక్ అసెంబ్లీ సీట్లు మైనంపల్లికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అలా కాకపోతే మెదక్ బరి నుంచి మైనంపల్లి కుమారుడు, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి హనుమంతరావు బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ గూటికి మైనంపల్లి చేరే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం.