అంతా అనుకున్నట్లే జరిగింది. టీడీపీ – జనసేన అన్ కండీషనల్గా ఒకటైనా స్థానికంగా క్షేత్రస్ధాయిలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం కుదరడం లేదు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల్లో విబేధాలు బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే తీవ్ర విమర్శలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. గతంలో టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జనసేన నేతలు… టీడీపీ వర్మను నిలదీశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఎందుకు ఓడించారని ప్రశ్నించారు.
దీంతో వర్మ మద్దతు దారులు జనసేన నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి సంఘటనే అనకాపల్లిలో జరిగింది. టీడీపీ – జనసేన నేతల మధ్య వాగ్వాదంతో సభకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయం కుదర్చడం అంత ఈజీ కాదని అందరికి అర్ధమైపోయింది.
ప్రధానంగా జనసేన బలంగా ఉందని భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ – జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశీస్తున్నారు జనసైనికులు. దీనిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మరి ఈ వివాదాలకు ఎలా పుల్ స్టాప్ పెడతారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తును ఎలా నడిపిస్తారో వేచిచూడాల్సిందే.