ఇరాక్లో భారతీయుల కిడ్నాప్ ఘటన విషాదాంతమైంది. నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న ఆ 39 మంది భారతీయులు మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు.
రాజ్యసభలో మాట్లాడుతూ, 2014లో వీరి కిడ్నాప్ జరిగిందని, వారిని గుర్తించేందుకు తామెంతో కృషి విఫలమయ్యామని తెలిపారు. మోసుల్ లో వీరిని పూడ్చి పెట్టిన చోటును రాడార్ల సాయంతో కనుగొన్నామని, మృతదేహాలను బయటకు తీయగా, పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయని, మృతదేహాలను బాగ్దాద్ కు తీసుకెళ్లి డీఎన్ఏ శాంపిల్స్ ను పరీక్షించగా, 70 శాతం మ్యాచ్ అయ్యాయని అన్నారు. ఆ అవశేషాలను ఇండియాకు తెచ్చేందుకు జనరల్ వీకే సింగ్ ఇరాక్ వెళ్తున్నారని, ప్రత్యేక విమానంలో అవశేషాలను తీసుకు వస్తామని అన్నారు.
ఆపై అవశేషాలను అమృత్ సర్, పట్నా, కోల్ కతా ప్రాంతాల్లోని వారి కుటుంబీకులకు అందిస్తామని తెలిపారు. కాగా, వీరంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని ఆశగా ఉన్న వారి కుటుంబాలను సుష్మా స్వరాజ్ ప్రకటన ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఆపై రాజ్యసభలో మృతుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని సభ మౌనం పాటించింది. ఆపై సుష్మా లోక్ సభలోనూ సభ్యుల నినాదాల మధ్య ఇదే ప్రకటన చేశారు.
ఉపాధి నిమిత్తం ఇరాక్లోని మోసుల్ నగరం వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న ఓ భారతీయుల బృందం 2014లో కిడ్నాప్కు గురైంది. మోసుల్ నుంచి తిరిగి వస్తుండగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అడ్డగించి వీరిని బంధీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి ఆచూకీ తెలియరాలేదు. వీరిని విడిపించేందుకు భారత ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.
వీరిలో ఒకరైన హర్జిత్ మాసీ అనే వ్యక్తి ఆ మధ్య ఇస్లామిక్ చెర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన కొన్ని కీలక విషయాలు చెప్పారు. తనతో పాటు బంధీలుగా ఉన్న మిగతావారిని బాదుష్ సమీపంలోని ఎడారిలో చంపేసినట్లు తెలిపారు. అయితే హర్జిత్ వ్యాఖ్యలను ప్రభుత్వం తోసిపుచ్చింది. సరైన ధ్రువీకరణ లేకుండా వారంతా చనిపోయారని భావించడం సరికాదని పేర్కొంది