రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, దళిత వర్గాల దేవుడు బి.ఆర్.అంబేద్కర్ మహా విగ్రహాన్ని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిది. ఇందుకు ఎన్టిఆర్ గార్డెన్ను ఎంపిక చేశారు. ఈ నెల 14 వ తేదిన అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్ధాపన చేయనున్నారు.
ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఆదివారం నాడు తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ ఆలీ, మంత్రి జగదీష్ రెడ్డి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటంచి ఎన్టిఆర్ గార్డెన్ అనువైన ప్రాంతంగా నిర్ణయించారు. 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమీపంలో 30 ఎకరాల స్ధలాన్ని పార్కుగా అభివద్ధి చేయాలని నిర్ణయించారు.
శంకుస్ధాపన రోజైన 14 వ తేదిన 10 వేల మందితో బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు. ఇంతవరకూ ఎన్టిఆర్ గార్డెన్గా పిలుస్తున్న ఈ ప్రాంతాన్ని ఇక నుంచి అంబేద్కర్ గార్డెన్ గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ ఏడాదింతా అంబెద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.