రాజధాని నిర్మాణంలో చంద్రబాబు సింగపూర్ కంపెనీలతో అవలంబిస్తున్న విధానాన్ని తప్పు పట్టారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. మరో సారి బాబు బండారాన్ని భయట పెట్టారు. సింగపూర్ స్విస్ చాలెంజ్పై ఐవైఆర్ కృష్ణారావు బాబుకు లేఖ రాశారు. చంద్రబాబు చెబుతున్నట్టు సింగపూర్ నీతి నిజాయితీలను నమ్మేందుకు వీల్లేదన్నారు.
కేవలం దేశ అంతర్గత పాలనలో మాత్రమే సింగపూర్ మంచి ప్రమాణాలను పాటిస్తుందని చెప్పారు. విదేశాల్లో కుంభకోణాలు చేసి సంపాదించిన సొమ్మును దాచుకునేందుకు మాత్రం సింగపూర్ స్వర్గధామంగా ఉందన్నారు. భారతదేశంలోని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సింగపూర్ కేంద్రంగా ఉందన్న విషయాన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా ప్రచురించాయని గుర్తు చేశారు. శారద కుంభకోణం సొమ్ము కూడా సింగపూర్కే చేరినట్టు ఆధారాలున్నాయన్నారు. అలాంటి దేశ కంపెనీలతో స్విస్ చాలెంజ్లో ఎన్నో ఉల్లంఘనలు జరిగాయన్నారు.
కేవలం దొడ్డిదారిలో సింగపూర్ కంపెనీలకు అమరావతిని అప్పగించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం ముంపుకు గురయ్యే అవకాశం ఉందంటూ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తోందని గుర్తు చేశారు. ఒకవేళ అక్కడ రాజధాని నిర్మించవద్దని తీర్పు వస్తే అప్పుడు సింగపూర్ కంపెనీలు భారీగా నష్టపరిహారం డిమాండ్ చేస్తాయన్నారు. కోర్టు పరిశీలనకు కూడా అవకాశం లేకుండా స్విస్ చాలెంజ్ను మార్చారని ఐవైఆర్ చెప్పారు. భూములతో పాటు, విద్యుత్, రోడ్లు, నీరు వంటి మౌళిక సదుపాయాలు కల్పించిన తర్వాత ఇక సింగపూర్ కంపెనీలు కష్టపడేది ఏముంటుందని ప్రశ్నించారు.
భూములు, మౌలిక సదుపాయాలు సమకూర్చిన తర్వాత ప్రాజెక్ట్లో తిరిగి ప్రభుత్వానికి వచ్చే లాభంపైనా స్పష్టత లేదన్నారు. పొట్టు నీవు తీసుకురా… శనగలు నేను తీసుకువస్తా… వాటిని కలిపేసి ఊదేసి పంచుకు తిందామన్నట్టుగా స్వీస్ చాలెంజ్ ఉందన్నారు.