ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన పలు హామీల అమలుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8 అంశాలే ప్రధాన అజెండాగా సచివాలయంలో జరిగిన కేబినేట్లో నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక పెన్షన్లు రూ.2,250కి పెంచుతూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, ఆశా వర్కర్ల జీతాలు రూ. 3000 నుంచి రూ.10,000కు పెంచుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపుకు పచ్చజెండా ఊపిన ఏపీ కేబినెట్… మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు క్యాబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించింది
ముఖ్యంగా వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలు, నవరత్నాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. APSRTCని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం, రైతు భరోసా పథకం, హోంగార్డుల వేతనాల పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై కేబినెట్లో చర్చించి… ఆమోదించబోతున్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున నవరత్నాల్లోని పెన్షన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఇదొకటి. దీన్ని కేబినెట్ ఆమోదించడం ద్వారా… వచ్చే నెల నుంచీ ముసలివాళ్లకు పెన్షన్ రూ.2250 రాబోతున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని రెండేళ్ల కిందట జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది అంత తేలిక కాదు కాబట్టి… ఇందుకోసం ఓ కమిటీ వేసే అవకాశాలున్నాయి.
ఈ ఏడాది అక్టోబరు 15 నుంచీ రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తానన్న జగన్… కేబినెట్లో దీనిపై కీలకంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. నవరత్నాల్లో భాగంగా జగన్… 2020 మే నుంచీ రైతు భరోసా పథకం ద్వారా ఏటా మే నెలలో పెట్టుబడి కింద రైతులకు రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఐతే… గత ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవను రద్దుచేసిన జగన్… ఈ ఏడాది రబీ సీజన్ నుంచే రైతు భరోసాను అమల్లోకి తెస్తామని తెలిపారు.