మోదీ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రిగా పనిచేస్తున్న అనంతకుమార్ కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. దీంతో భాజాపా నేతలు షాక్ గురయ్యారు.
కేన్సర్ విషమించి ఈ తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మరణించగా, ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని బెంగళూరు నేషనల్ కాలేజీలో ఉంచనున్నారు. మొత్తం ఆరుసార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన పలు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
1996 నుంచి ఆయన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోడీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయనశాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అనంతకుమార్ అకాల మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన సతీమణికి ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిస్వార్థ నాయకుడు అనంతకుమార్ అంటూ మోదీ నివాళులర్పించారు. మరోవైపు హోంమంత్రి రాజ్నాథ్ కూడా అనంత కుమార్ మంచి పార్లమెంటరీయన్ అన్నారు. ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.