తెలంగాణ ఏసీబీ ధర్యాప్తును కొనసాగిస్తున్న ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి చార్జిషీట్ ను సమర్పించినా..అందులో బాబుగారి పేరు లేకపోయినా.. తదుపరి చార్జిషీట్ లో మాత్రం ఆయన పేరు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ మేరకు ఏసీబీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. 60 రోజుల పరిశోధన తర్వాత తెలంగాణ ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది.
ఇందులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మరో ముగ్గురి పేర్లు ఉన్నాయి. అయితే ఓటుకు నోటు వ్యవహరంలో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో సంభాషించాడన్న ఏపీ ముఖ్యమంత్రి పేరు మాత్రం తొలి చార్జిషీట్ లో లేదు. ఇలాంటి నేపథ్యంలో… ఆయన బయటపడిపోయినట్టేనని చాలా మంది అంటున్నారు. కానీ ఇంతటితో కథ అయిపోలేదని.. అతి త్వరలో రెండో చార్జిషీటు దాఖలు అయ్యే అవకాశాలున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
మరి అన్నట్టుగానే ఏసీబీ అధికారులు ఏపీ సీఎం పేరును రెండో చార్జిషీట్లో పెడితే.. అప్పుడు బాబు రాజీనామా చేయాల్సి ఉంటుందా? అనే ఊహాగానాలు ఊపందుకొంటున్నాయి. చార్జిషీట్ లో నిందితుడిగా.. ఆయన ఏసీబీ విచారణను ఎదుర్కొనాల్సి వస్తే… రాజీనామా చేయకతప్పకపోవచ్చని కొంతమంది అంటుంటే.. పరిస్థితి అంత వరకూ రాదని మరికొందరు అంటున్నారు. మరి ఏది నిజం అవుతుందో!