తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉంది. అయినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కరసత్తు చేస్తోంది. మూడేళ్ల ముందే కాంగ్రెస్ కోయిలలు కూతలు ప్రారంభించాయి.
ఎన్నిక బ్రిగేడ్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. శనివారం గాంధీభవన్ లో పార్టీ అగ్రనేతలు సుదీర్ఘంగా సమావేశమై ఎలక్షన్ ప్లాన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 30 మందిని ఎంపిక చేసి ఎలక్షన్ బ్రిగేడ్ ను తయారు చేయనున్నది. వీరికి ఎఐసిసి వివిధ అంశాలపై శిక్షణనిస్తుంది. అది కూడా ఎన్నికల మాంత్రికుడిగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు వీరిని పార్టీ ఫుల్ టైం వర్కర్లుగా నియమిస్తారు. ఈ బ్రిగేడ్ ఎఐసిసికి అనుబంధంగా పనిచేస్తుంది. వీరు స్ధానిక నేతలతో కలిసి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను తయారుచేస్తారు. ఇక టిపిసిసికి సంబంధించి ఇప్పటి వరకూ అమలవుతున్న జంబో టీంను భారీగా కుదించనున్నారు. పార్టీ అధికార ప్రతినిధులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల సంఖ్యను సగానికి సగం తగ్గించనున్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని కూడా పటిష్టం చేసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.