ఢిల్లీలో హైలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇద్దరు ఉగ్రవాదుల చొరబడ్డారనే నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులు ఢిల్లీలోకి ప్రవేశించారని, వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని హెచ్చరిస్తూ వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.
అణుమానితులు కనిపిస్తే వెంటనే ఫహర్గంజ్ పోలీస్ స్టేషన్ 011-23520787 లేదా 011-2352474 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాల్సిందిగా పేర్కొన్నారు. వీరి పట్టివేతకు పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. పంజాబ్ కౌంటర్ ఇంటలిజెన్స్ వింగ్ ఆ రాష్ట్ర పోలీసు శాఖకు హెచ్చరికలు జారీ చేస్తూ జైషే-ఇ-మహ్మద్కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు రాష్ట్రంలో ప్రవేశించినట్లు తెలిపింది.
పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్పూర్కు 9 కిలోమీటర్ల దూరంలో ఓ మైలురాయి వద్ద నలుపు, కాఫీ రంగు కుర్తాలు ధరించిన ఇద్దరు యువకులు ఉన్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ పట్టణం భారత్, పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు.
పంజాబ్లో ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల అనంతరం ఐబీ హెచ్చరికలు చేయడంతో రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే మహమ్మద్కు చెందిన ఆరు లేదా ఏడుగురు ఉగ్రవాదుల బృందం పంజాబ్లోకి ప్రవేశించారని, ఇక్కడి నుంచి వారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆ రాష్ట్ర పోలీస్ నిఘా విభాగం తెలపడంతో పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించారు.