ఏపీ సీఎం చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ మాములుగా ఉండవని అందరికీ తెలిసిందే. చంద్రబాబు నోటి నుంచి ఓ మాట పూర్తిగా రాకముందే విపరీతంగా ప్రచారం చేస్తుంది ఆయన అనుకూల మీడియా. అలాంటిది ఆయన ఇప్పుడు డేటా చోరి అంశంపై ఎక్కిన ప్రతి వేదికపై మాట్లాడుతున్నారు. తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. ఇక మీడియా తన పని తను చేసుకుపోతుంది.
అసలు ఎవరి డేటా చోరి జరిగింది? ఆ డేటా వారికి ఎలా వచ్చింది? ఐటీ గ్రిడ్ సంస్థ బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? సేవామిత్ర యాప్లోకి ఓటర్ల కలర్ ఫోటోలతో సహా వ్యక్తిగత వివరాలు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలేవి మీడియా బుర్రలకు తట్టడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజల డేటా కొట్టేసింది అన్న వ్యాఖ్యలు మాత్రమే ప్రతి ఒక్క టీడీపీ నేత నోళ్లలో నానుతున్నాయి.. మీడియాలో కనిపిస్తున్నాయి.
కేసు నమోదు అయ్యింది ఐటీ గ్రిడ్ సంస్థపై. ఆ సంస్థ సీఈఓ అశోక్ చంద్రబాబుకు చాలా దగ్గరి మనిషి. టీడీపీ పార్టీ కోసం సేవా మిత్ర అనే యాప్ను రూపొందించింది ఐటీ గ్రిడ్ సంస్థ. అందులో కేవలం టీడీపీ కార్యకర్తల వివరాలు ఉంటాయి. కానీ ఇందులో ఏపీ ఓటర్ల డేటా మొత్తం ఉందనేది విపక్షాల వాదన? అసలు టీడీపీ కార్యకర్త కాని నా డేటా ఎక్కడి నుంచి వచ్చిందని హైదరాబాద్లో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఎప్పుడైతే కేసు నమోదైందో.. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నేతలపై ముప్పేట దాడి ప్రారంభించారు. అందులో ఏ తప్పు లేకపోతే చంద్రబాబు ఇంత తీవ్రంగా ఎందుకు రియాక్టవుతున్నారు?
అంతేకాదు కేసు నమోదైన మరుక్షణమే సేవా మిత్ర యాప్ నుంచి అన్ని వివరాలను తొలగించారు టీడీపీ నేతలు. అన్ని సక్రమంగా ఉన్నప్పుడు వివరాలను తొలగించడం ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. 30 ఏళ్లు కష్టపడి సేకరించిన వివరాలు అని చంద్రబాబు అన్నారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం దొంగలించింది అంటున్నారు. తెలంగాణ పోలీసుల వద్ద నిజంగా డేటా ఉంటే.. దానికి సరైన రుజువులు చూపించి తీసుకొవచ్చు. అది చోరి ఎలా అవుతుందో టీడీపీ నేతలకే తెలియాలి.
జనాభా లెక్కల కోసం వేల మంది అధికారులు ఇంటింటికి తిరిగి సేకరించినట్టు.. టీడీపీ నేతలు కూడా తిరిగి వివరాలను సేకరించారా? వారి కలర్ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో సహ వ్యక్తిగత వివరాలు ప్రజలను అడిగి తీసుకున్నారా? ఇన్ని ప్రశ్నలకు వదిలేసి వైఎస్ఆర్సీపీ, తెలంగాణ ప్రభుత్వం డేటా చోరి చేసిందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రజలు నమ్ముతారా? ఆయన అనుకూల మీడియా పదే పదే అదే వార్తను చూపించి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? ఐటీ గ్రిడ్ సంస్థ అశోక్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు? ఆయన వెంట పలు హార్డ్ డిస్క్లను ఎందుకు తీసుకెళ్లారు? అన్ని ఒక్క మీడియా సంస్థ కూడా ఎందుకు ప్రశ్నించడం లేదన్న ఆలోచన ప్రజలకు రాదా? ఏమో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో వారికే తెలియాలి.