ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గం విజయనగరం. బొత్స,గజపతి,బొబ్బిలి రాజులు, పెన్మత్స సాంబశివరాజు వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. ఈ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈసారి తీర్పు ఎలా ఉండబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2019 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ గెలుపొందగా ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. ఇక కూటమి తరపున కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. విజయనగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, చీపురుపల్లి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నాయి. 9 స్థానాల్లో టీడీపీ 8,నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారు.
విజయనగరం జిల్లాలో ఒక్క సిట్టింగ్ అభ్యర్థిని మార్చలేదు వైసీపీ. టీడీపీ మాత్రం కొన్ని సీట్లను చివరివరకు పెండింగ్లో పెట్టి సీనియర్లను అడ్జస్ట్ చేసింది. ఈ జిల్లాపై పూర్తి పట్టు సాధించడంలో బొత్సది పైచేయి అనే చెప్పుకోవాలి. ఆయన కుటుంబం నుండే నలుగురు ఎన్నికల బరిలో నిలిచారు. జిల్లా అభివృద్ధిపై తనదైన మార్క్ స్పష్టంగా చూపించారు బొత్స. దీనికి తోడు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఈసారి కూడా వైసీపీని గట్టెక్కిస్తాయని, జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. మరి ఈ జిల్లా ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాలి.