అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యానంతరం మావోయిస్టుల కోసం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య తర్వాత పలువురు నేతలకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఓబీలో పోలీసులు జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే.
ఏఓబీలో తాజాగా మరో ఎన్కౌంటర్ జరిగింది. ఏపీ, ఒడిశాకు చెందిన స్పెషల్ భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ దాడిలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఏఓబీలోని బెజ్జంగి – పనసపుట్టి సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. అదే సమయంలో వారి మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. వారిలో ఒకరు మహిళా మావోయిస్టు. ఇద్దరూ దళంలో కీలక సభ్యులని బలగాలు చెబుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు చంపిన తర్వాత పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఏవోబీలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కీలక దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, మరికొందరు తప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది.