భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తొలితరం నేతల్లో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా శుక్రవారం పార్టీకి గుడ్బై చెప్పారు. మొదటినుంచి మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా కలిసి పొలిటికల్ యాక్షన్ గ్రూప్ ‘రాష్ట్ర మంచ్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాట్నాలో రాష్ట్ర మంచ్ ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న రిపోర్టర్లను హత్యలు చేయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, బీజేపీతో ఉన్న అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నానని అన్నారు. 2002-04 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎక్స్ టర్నల్ అఫైర్స్ శాఖా మంత్రిగా, 1998-2002 లో ఫైనాన్స్ మినిస్టర్ గా యశ్వంత్ సిన్హా పని చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా మంత్రిగా ఉన్నారు. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిగా జయంత్ సిన్హా పనిచేస్తున్నారు.