ఓ జవాన్ వీరోచిత పోరాటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చేతిలో ఆయుధం లేకపోయినా నలుగురు సాయుధ మావోయిష్టులను తరిమికొట్టాడు. ఛాతీమీద తీవ్రగాయాలయినా తన ఆయుధాన్ని ఎత్తుకెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెల్తే… 33 ఏళ్ల గోంజీ మట్టామి గడ్చిరోలి ప్రధాన కార్యాలయంలో 2006 నుంచి జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన పలు ఎన్కౌంటర్లలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆదివారం నాడు కూడా తన ధైర్యసాహసాలను మరోసారి ప్రదర్శించాడు. గడ్చిరోలిలోని ఈతపల్లి తాలూకా, జాంబియా గట్టలో రద్దీగా ఉన్న మార్కెట్లో ఓ యాక్షన్ టీమ్కి చెందిన నలుగురు మావోయిస్టులతో అతను పోరాడాడు. తన ఏకే-47 రైఫిల్ను, మేగజైన్లను ఎత్తుకెళ్లిపోవడానికి వారు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు. ఈ ప్రయత్నంలో తన ఛాతీపై వారు చేసిన గాయాన్ని సైతం ఆయన లక్ష్యపెట్టలేదు. వారితో వట్టి చేతులతోనే పోరాడి ఔరా అనిపించుకున్నాడు.
జాంబియా గట్టా పోలీస్ పోస్ట్ సమీపంలోని వారపు సంత వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తోన్న గోమ్జీ, మార్కెట్లో తన క్లాస్మేట్ కనిపించడంతో మాట్లాడుతున్నాడు. ఇంతలోనే మఫ్టీలో వచ్చిన నలుగురు నక్సల్స్ గోమ్జీని చుట్టిముట్టి దాడిచేసి కిందపడదోశారు. యాక్షన్ దళానికి చెందిన మావోయిస్టులు అతడిపై దాడిచేసి ఏకే 47ను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. వారి వద్ద ఉన్నతుపాకితో గోమ్జీకి గురిపెట్టినా అదృష్టవశాత్తు అది గురితప్పింది. తుపాకీ పేలకపోవడంతో వెంటనే వాడిపై బూటికాలితో తన్నాడు. దీంతో వాడి చేతిలోని ఆయుధం కిందపడిపోయింది. కానీ ఇంతలోనే మరొకడు తన చేతిలో ఉన్న డాగర్తో గుండెల్లో పొడిచాడు. బలంగా దెబ్బ తగిలి రక్తమోడటంతో ఆ బాధకు తట్టుకోలేక తన ఆయుధంపై పట్టుకోల్పోయాడు.
చేతిలో నుంచి తుపాకి చేజారడంతో దాన్ని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న, తన ఏకే 47 దొరకబుచ్చుకున్న వాణ్ని వెంబడించాడు. మరోవైపు కాల్పులు జరిపి పారిపోతున్నా పట్టుకుని ముష్టిఘాతాలు కురిపించాడు. దీంతో వాడు ఆయుధాన్ని వదిలేసి పారిపోయాడు. మార్కెట్లో రద్దీగా ఉండటంతో వారిపై కాల్పులకు ప్రయత్నించి, తర్వాత మిరమించుకున్నాడు.
పోలీసు శాఖ వ్యాప్తంగా ఇప్పుడు మట్టామి వీరోచిత పోరాటాల గురించే చర్చించుకుంటున్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలను వచ్చే ఏడాది ప్రభుత్వం అతనికి అవార్డును బహూకరించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. మట్టామి ప్రస్తుతం ఆరెంజ్ సిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఓసీహెచ్ఆర్ఐ)లో చికిత్స పొందుతున్నాడు. ఛాతీకి గాయమైనప్పటికీ ఆయన హుషాలుగా పలకరిస్తుండటం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.