దేన్నీ తెగే వరకూ లాగకూడదు.. ప్రత్యేకించి రాజకీయాల్లో అయితే కీలకమైన వ్యవహారాల విషయంలో ఆచితూచి స్పందించే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ప్రత్యర్థి పై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం వచ్చినా.. వారు మరీ అతి చేయరు.
ఓటుకు నోటు వ్యవహారంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇదే తీరున వ్యవహరిస్తుందనుకొన్నారంతా. అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా తగ్గలేదు.
ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబును కూడా లాగేసింది కేసీఆర్ ప్రభుత్వం.
మొదటగా రేవంత్ చెబితేనే చంద్రబాబు పేరును ఈ ఓటుకు నోటు వ్యవహారంలో పెడతారు.. లేకపోతే లేదు అనుకొన్నారంతా. అయితే ఉనట్టుండి బాబు ఆడియో టేపులను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వెళ్లి కలిశారు. ఇరు రాష్ట్రాల మధ్య పెద్దమనిషిలాంటి వ్యక్తి అయిన ఆయనను తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులు విడివిడిగా వెళ్లి కలిశారు.
ఈ పరిణామం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కు గవర్నర్ నరసింహన్ హితబోధ చేశారని టాక్. ఈ వ్యవహారాన్ని తెగే వరకూ లాగొద్దని.. రేవంత్ తోనే ఆపాలని, ఏపీ సీఎం చంద్రబాబును ఇన్ వాల్వ్ చేయవద్దని.. అదంతా మంచిది కాదని నరసింహన్ కేసీఆర్ కు సూచించాడని అంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం గవర్నర్ సూచనను పట్టించుకోనట్టు భోగట్టా!