ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను నిలదీశారు. మీరు ఉగాది పండుగకు, ఇతరత్రా సంబరాలకు రాజభవన్కు ఆహ్వానించి పక్కన కూర్చుండబెట్టుకుంటే నిజంగానే సంతోషిస్తాను కానీ మా పార్టీ ఉనికికి ప్రమాదం తెచ్చే పనులకు సిద్ధమైతే.. ఎంత గవర్నర్ అయితే మాత్రం ఊరుకుంటానా అంటూ జగన్ గవర్నర్కే జలక్ ఇచ్చారు.
వైకాపా టిక్కెట్టుపై గెలిచి, అదే పార్టీ సభ్యత్వంలో కొనసాగుతూ తెలుగుదేశం ప్రభుత్వ కేబినెట్లో చేరిన నలుగురు ఫిరాయింపుదారులపై తగు చర్య తీసుకోవాలంటూ వైఎస్ జగన్ తనను అభ్యర్థించినపుడు గవర్నర్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. సోమవారం నాడు గవర్నర్కు లేఖ రాస్తూ.. ఏపీ కేబినెట్ లోని కృష్ణ రంగారావు, అమరనాథ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి నలుగురు మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై గెలిచి తర్వాత మరో 17 మందితో కలిసి తమ పదవులకు రాజీనామా చేయకుండానే.. టీడీపీలోకి వెళ్లారని జగన్ పేర్కొన్నారు.
అసెంబ్లీ రికార్డుల ప్రకారం వైసీపీలో 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆ విషయంలో ఈరోజు వరకు ఎలాంటి మార్పులేదని జగన్ తెలిపారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ మంత్రివర్గంలోకి ఏ విధంగా తీసుకుంటారని గవర్నర్ను ప్రశ్నించారు. అలానే చంద్రబాబు చర్యల పట్ల గవర్నర్ మౌనం గా ఉన్నారని.. అది సరికాదని.. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని జగన్ గవర్నర్కి చెప్పారు. ఈ పదేళ్లలో రాష్ట్ర వ్యవహారాల్లో ఎన్నడూ ఇరుక్కోని, మకిలి అంటని గవర్నర్కి ఏపీలో ఫిరాయింపుదార్లను మంత్రులుగా తీసుకోవడం మహా ఇబ్బందిగా మారింది. ఫిరాయింపు మంత్రుల వ్యవహారం న్యాయస్థానం వరకు వెళితే, అది రేపు గవర్నర్ ప్రతిష్టకు కూడా భంగకరమేనని చెబుతున్నారు.