కేంద్రం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఇంకా ఎన్డీఏ కూటమిలో ఉంటూ రోజుకో నాటకాలు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ఆట కట్టడి చేయాలని ఆలోచిస్తోంది. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాయగా ఆ లేఖపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. బీజేపీని ప్రత్యక్షంగా దూషిస్తుండడంతో చంద్రబాబుకు ముకుతాడు వేసే పనిలో బీజేపీ సిద్ధమవుతోంది.
అందులో భాగంగా చంద్రబాబును ఇరకాటంలో పడేసేలా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు కలిపి గవర్నర్గా నరసింహన్ ఉన్నారు. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తయ్యింది. అయినా అలాగే కొనసాగిస్తున్నారు. మారిన రాజకీయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు గవర్నర్ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీని ఏపీకి వేయాలని కేంద్రం ఆలోచన. తెలంగాణ గవర్నర్గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇరిగేషన్) సీవీఎస్కే శర్మ పేరు కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే పాండిచ్చేరిలో అధికారి పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్న కిరణ్ బేడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ఆడుకునే అవకాశం ఉంది. ఆమె నియామకంతో చంద్రబాబు తోక ముడుచుకునేలా బీజేపీ ప్లాన్ వేస్తోంది. పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ తమ మంత్రులను కేంద్ర కేబినెట్ నుంచి ఇటీవల ఉపసంహరించుకోవడం, బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ల మార్పు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వాటిలో భాగంగా ఏపీకి కిరణ్ బేడీని గవర్నర్గా పంపాలని ప్లాన్. ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ను నియమించాలని బీజేపీ ఏపీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడో కోరారు. మారిన రాజకీయాల నేపథ్యంలో ఏపీకి కొత్త గవర్నర్ను నియమించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు గత జనవరి 11వ తేదీన లేఖ రాశారు.