మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ధూలే ప్రాంతంలోని సిర్పూర్ తాలూకా వాఘాడి గ్రామంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 8మందికి పైగా కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు. పరిశ్రమలో దాదాపు 100 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.ఆ ప్రాంతాన్ని భారీ ఎత్తున నల్లటి పొగ కమ్ముకున్నది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది. గాయపడ్డవారిని హాస్పటల్కు తరలించారు.
ఫ్యాక్టరీ నుంచి 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పేలుడు అనంతరం ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి . కర్మాగారంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన గ్యాస్ సిలెండర్లు పేలడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఇతర అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.