ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించినట్టే అంటోంది ఒక వర్గం మీడియా. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని బాబు గారికి ఊరటనిచ్చే పని మొదలు పెట్టాడని ఆ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాబుతో కాకుండా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో మాట్లాడి బాబును సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడట నరేంద్రమోడీ. ఈ మేరకు ఆ మీడియా కథనాలు వస్తున్నాయి.
పరిస్థితి చల్లబడేలా చూడండి అంటూ నరసింహన్ కు సూచనలు చేశాడట ప్రధాని. తనతో జరిగిన సమావేశంలో ప్రధాని ఆయనకు ఈ సూచనలు చేశాడని ఆ మీడియా చెబుతోంది. అయితే ఇదంతా ఒక వర్గం మీడియా ఇస్తున్న సమాచారం అనే విషయాన్ని గమనించాలి. బాబు కు అనుకూలంగా పనిచేసే మీడియా వర్గాలే ఈ మాటను చెబుతున్నాయి. ప్రధాని స్థాయిలో వ్యవహారం పరిష్కారం అయిపోయింది.. బాబూ ఈజ్ సేఫ్ అని ఆ మీడియా కథనాల సారాంశం.
మోడీ జోక్యం చేసుకొన్నాడు కాబట్టి.. నరసింహన్ కు ఆదేశాలు జారీ చేసి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించాడు కాబట్టి.. ఏసీబీ కూడా ఇక వెనక్కుతగ్గాల్సిందే..అన్నట్టుగా ఉన్నాయి ఆమీడియా కథనాలు. మరి ఇవి వాస్తవమైనవేనా? మోడీ నిజంగానే బాబును రక్షించడానికి ప్రయత్నిస్తున్నారా? అనేవి సందేహాలు. అయినా ఈ వ్యవహారంలో బాబును రక్షించాలని ప్రయత్నిస్తే అది బీజేపీకి కూడా మైనస్ పాయింటే కదా!