ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకుందుకు కాపులు సిద్ధమవుతున్నారు. తమ న్యామమైన డిమాండ్లను బుధవారం సాయంత్రంలోగా పరిష్కరించాలని, లేకుంటే గురువారం నుంచి దీక్షచేపడతానని కాపు జాతి నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తుని ఘటనకు బాధ్యులంటూ ప్రభుత్వం కొందరిని అరెస్టు చేసిందని, వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వాళ్లపై రౌడీ షీట్లు, ఇతర కేసులు ఉంటే వాటిని వేరే విధంగా పరిగణించాలి తప్ప కాపు ఉద్యమంతో ముడిపెట్టకూడదని ముద్రగడ స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా కాపులు కష్టాలు పడుతున్నారని, ఎన్నికల సమయంలోనే వారు గుర్తుకొస్తున్నారు తప్ప మిగిలిన సమయాల్లో రాజకీయ పార్టీలు వారిని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల సమస్యలపై కమిషన్ వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకూ దాని అతిగతా పట్టించుకోలేదని ముద్రగడ విమర్శించారు.
తమది ఆకలి పోరాటమని, ఆ ఉద్యమం వెనుక వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన రెడ్డి ఉన్నారని చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టివేశారు. మరోవైపు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడి కాపు నాయకులు, యువకులతో నిండిపోయింది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో స్ధానికులున్నారు. ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటోంది.