భర్త కానీ, భార్య కానీ కుటుంబ నియంత్రణకు అనుగుణంగా ఆపరేషన్ చేయించుకొని ఉంటేనే.. వారి ఇంట్లో వాళ్లకు ఓటు హక్కును ఇవ్వాలి అంటున్నాడు భారతీయ జనతా పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్.
ఒకవైపు ముస్లింలను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని శివసేన నేతలు ప్రకటనలు చేస్తున్న తరుణంలో ఈ వివాదంలో తను కూడా పదం కలిపాడు సాక్షి మహరాజ్. కుటుంబ నియంత్రణ పాటించని వారికి ఓటేసే హక్కు లేదనేది సాక్షి మహరాజ్ వాదన!
స్వతంత్రం వచ్చేంత వరకూ కూడా దేశంలో జనాభా నియంత్రణలోనే ఉందని.. ప్రజాస్వామ్యంలో కుటుంబ నియంత్రణ లేకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోయింది ఈ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశాడు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలని.. కుటుంబ నియంత్రణ పాటించిన వారికే ఓటు హక్కు అనే నియమాన్ని పెట్టడం ద్వారా పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలని.. ప్రతిపక్షం కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తే మంచిదని ఈయన అభిప్రాయపడ్డారు. మరి మొన్నటి వరకూ ఇదే ఎంపీగారు, కొంతమంది హిందుత్వ వాదులు హిందువులు కుటుంబ నియంత్రణ పాటించాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేశారు. హిందువులు కూడా ఎక్కువమంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడేమో కుటుంబ నియంత్రణ పాటించని వారికి ఓటు హక్కు ఇవ్వకూడదని అంటున్నారు! మరి ఇవన్నీ ఉత్తుత్తిమాటలే కదా.. ఎలాగూ ఇవి చట్టాలుగా మారి అమలు వరకూ వెళ్లవు కదా!