తన మనసులోని మాటను, అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. సొంత పార్టీని సైతం విమర్శించేందుకు ఆయన వెనుకాడరు. అంతేకాదు.. తమ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ సెటైర్లు వేస్తారు కూడా. ఇక మోదీ సర్కారు అట్టహాసంగా తొమ్మిదవ సారి ప్రవేశపెట్టిన సోమవారం నాటి కేంద్ర బడ్జెట్పై సైతం ఇలాగే స్పందించారు సుబ్రహ్మణ్య స్వామి.
నిర్మలమ్మ డిజిటల్ పద్ధతి బడ్జెట్ సామాన్యుడి నడ్డి విరిచిందని విమర్శలు వస్తున్న వేళ ఈ బీజేపీ సీనియర్ ఎంపీ ట్వీట్ వైరల్ అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై తనదైన శైలిలో స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి.. ‘రాముడి జన్మభూమిగా భావిస్తున్న భారత్లో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు.. సీతమ్మవారు జన్మించిన దేశం నేపాల్లో అదే లీటర్ పెట్రోల్ ధర 53 రూపాయలు.. ఇక రావణుడి లంకలో అదే పెట్రోల్ లీటర్ 51 రూపాయలు మాత్రమే’’ అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
కాగా ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు సామాన్యుడికి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కొన్ని ప్రధాన పట్టణాల్లో పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటగా.. బడ్జెట్-2021లో కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద అగ్రికల్చరల్ సెస్ విధిస్తున్నుట్లు తెలిపింది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. సుంకం నుంచి మినహాయిస్తామని కాస్త ఊరట కలిగించింది ఎన్డీయే సర్కారు. ఇక బడ్జెట్పై ఇప్పటికే సోషల్ మీడియాలో జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే.
అదే జరిగితే దేశం రెండు ముక్కలవ్వడం ఖాయం