- ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని విద్యార్థి ఆత్మహత్య
- ప్రభుత్వ హత్యేనని విద్యార్థుల ఆందోళన
పోరాటాలకు పుట్టిల్లు ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రశాంతంగా ఉండేంది. ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు, బంద్లన్నీ బందయ్యాయి. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న విశ్వవిద్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మళ్లీ పోలీసుల బూటు చప్పుళ్లు, బారికేడ్లు, టాఠీలు విద్యాసౌధంలోకి అడుగుపెట్టాయి. నినాదాలు, అరుపులు, కేకలతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డయ్యాయి.
ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థి ఈ.మురళీ ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల ఒత్తిడి భరించలేనని ఆత్మహత్య లేఖ రాసి విశ్వవిద్యాలయంలోని మానేర్ హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకొని ప్రాణాలు వదిలాడు. దీంతో ఓయూలో పోలీసులు మొహరించారు. ఉద్యమ సమయంలో మాదిరి బారీకేడ్లు, బాష్పవాయువు యంత్రాలు, డీసీఎంలు, వ్యాన్లు తదితర వాహనాలు ఓయూలోకి చేరాయి. ఓయూ నలువైపులా ఉన్న గేట్లను బారికేడ్లతో మూసేసి బందోబస్తు చేపట్టారు. ఓయూ లోపల నుంచి సాధారణ ప్రజల రాకపోకలను నిలిపివేశారు. విద్యార్థి సంఘాల నాయకులు ఓయూ బంద్ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. విద్యార్థులను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపానికి లోనై మురళీ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నర ఏళ్లయినా ఉద్యోగ భర్తీలు చేపట్టడం లేదని విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండ రాం కొలువుల కోసం కొట్లాట సభకు ముందు రోజే ఈ ఘటన జరగడంతో ఉద్యమం ఎగిసిపడేలా కనిపిస్తోంది.