కాంగ్రెస్ దిగ్గజం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. రోహిత్ను హత్య చేశారని పోస్ట్ మార్టం రిపోర్టు రావడంతో పోలీసులు కేసును ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు.ఈ కేసులో బుధవారం రోహిత్ భార్య అపూర్వ శుక్లాను అరెస్ట్ చేశారు. విచారణలో అపూర్వ తన నేరాన్ని అంగీకరించింది. రోహిత్ ను ఎప్పుడు, ఎందుకు, ఎలా హత్య చేసిందో పోలీసులకు వెల్లడించింది.
వైవాహిక జీవితంలో కలతలు, ఆస్తి పంపకాల్లో విభేదాల కారణంగానే రోహిత్ శేఖర్ తివారీని అతని భార్య అపూర్వ శుక్లా హత్య చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపినట్లు సమాచారం.శేఖర్ ది సహజ మరణం కాదని, దిండును ముఖంపై నొక్కిపెట్టడంతో ఊపిరాడక మృతి చెందాడని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రోహిత్ ను భార్య అపూర్వ చంపిందని, వారి వైవాహిక జీవితం సంతోషంగా లేదని రోహిత్ తల్లి ఉజ్వల తివారీ ఆరోపించారు. శేఖర్ భార్య అపూర్వను 3 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
సోమవారం ఏప్రిల్ 15 ఉత్తరాఖండ్ నుంచి తిరిగి వస్తున్నపుడు రోహిత్ తనకు వరసకు వదినైన కుంకుమ్ తో కలిసి మద్యం సేవించాడు. వాల్లిద్దరి సంబంధాలపై మొదటినుంచి అపూర్వకు అనుమానంగా ఉండేది. రాత్రి సుమారు 9.30 గంటలకు ఇంటికి రాగానే అపూర్వ ఎవరితో కలిసి మద్యం తాగావని ప్రశ్నించింది. కుంకుమ్ తో అని రోహిత్ సమాధానం ఇవ్వగానే అపూర్వ ఆగ్రహోదగ్రురాలైంది. దీంతో ఇద్దరి మధ్యన తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిపింది.
రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో అపూర్వ రోహిత్ గదిలోకి వెళ్లి మరోసారి వాదనకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో అపూర్వ ఒకచేత్తో రోహిత్ గొంతు పిసుకుతూ రెండో చేత్తో నోరు నొక్కింది. దీంతో రోహిత్ చనిపోయాడు.రోహిత్ మేలుకొని ఉండగానే హత్య జరిగిందన్న పోలీసుల అనుమానాలే చివరకు నిజమయ్యాయి. రోహిత్ ను హత్య చేసినందువల్ల మర్నాడు అపూర్వ అతని గదిలోకి వెళ్లలేదు. ఆమె 16 ఏప్రిల్ సాయంత్రం 4 గంటలకు పనిమనిషిని రోహిత్ గదిలోకి పంపింది. నౌకరే రోహిత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోందని, శరీరం చల్లగా అయిందని చెప్పడంతో రోహిత్ ను హాస్పిటల్ కి తరలించినట్టు అపూర్వ శుక్లా విచారణలో తెలిపింది.
