తెలంగాణ అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు తీవ్ర గందరగోళంతో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. ఈ పరిణామాలతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కీలక ప్రతిపాదన చేశారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ సభ్యులందరినీ ప్రస్తుత సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని కోరారు. మంత్రి ప్రతిపాదనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదం తెలిపారు.
కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్తో పాటు మొత్తం 19 మంది బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. సస్పెన్షన్ అనంతరం సభ నుంచి బయటకు వెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభాపతిని, ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. దొరతనం పోకడలను భరించడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. బలహీనవర్గాలు, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా విపక్ష నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు.
