మధుర రక్తసిక్తమైంది. మరుభూమిని తలపించింది. వందల ఎకరాల భూమిని ఆక్రమించుకున్న వారిపై పోలీసులు దాడి చేస్తే వారిపై ఆక్రమణదారులు ఎదురుదాడికి దిగారు. దీంతో ఎస్పీ, ఎస్ హెచ్ ఓ తో పాటు 22 మంది ఆందోళనకారులు మరణించారు. మధురలో వందల ఎకరాల భూమి ఆక్రమణదారుల స్వాధీనంలో ఉంది.
ఆక్రమణదారులంతా ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘర్షణలో పోలీసులు పెద్ద ఎత్తున మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి బాధ్యులైన వారిలో 320 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ సంఘటనపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డివిజనల్ కమిషనర్ ను ఆదేశించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. నిజానికి మధురలోని జవహర్ బాగ్ లో 260 ఎకరాల్లో మూడు వేల మంది రెండు సంవత్సరాలుగా ఉంటున్నారు.
వీరందరిని ఖాళీ చేయించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేస్తుండగా ఈ ఘర్షణ జరిగింది. అక్కడ పోలీసులు రెక్కి నిర్వహిస్తూండగా ఆందోళనకారులు ఎలాంటి కవ్వింపు లేకుండానే తమపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని యుపి డిజిపి జావెద్ అహ్మద్ తెలిపారు. ఆందోళనకారులు దాదాపు వెయ్యి గ్యాస్ సిలెండర్లతో ఆయుధ నిల్వలకు నిప్పుపెట్టారన్నారు. దీంతో అక్కడ భారీ విస్పోటనం జరిగిందన్నారు. మరోవైపు యుపి సిఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ నిఘా వైఫల్యం కారణంగా ఈ సంఘటన జరిగిందన్నారు. పోలీసు కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.