బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుఫాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. గంటకు 140-220కి.మీ వేగంతో.. ఒడిశా తీరం దాటి శ్రీకాకుళం జిల్లాపై తన పంజా విసిరింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు, పల్లెసారథి మధ్య గురువారం తెల్లవారు జామున తీరాన్ని తాకింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. పలు మండలాల్లో కరెంట్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. 53 కిలోమీటర్ల తుపాను కేంద్రకం విస్తరించి ఉంది.
వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు, పల్లిసారథి మధ్య గురువారం తెల్లవారుజామున తుఫాన్ తీరాన్ని తాకింది. గంటకు 14 కి.మీ. వేగంతో కదులుతూ పెనుగాలులతో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 120 నుంచి 150 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో పెనుగాలులకు తోడు, భారీ వర్షం కురుస్తోంది. పెనుగాలుల నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. తీరం దాటిన అనంతరం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
టిట్లీ తుపాన్ తీరం తాకిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.